సన్గ్లాసెస్తో విరాట్ కోహ్లి (ప్రతీకాత్మకం)
ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారి అదే జోరు కొనసాగిస్తూ.. ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.
కీలక ప్రకటన
ఇక రెండో బెర్తు కోసం పోటీలో ఉన్న గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ (GT vs RR) క్వాలిఫయర్-2లో శుక్రవారం అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్న వేళ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) కీలక ప్రకటన చేసింది.
ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు స్మార్ట్ సన్గ్లాసెస్ ధరించకూడదని ACSU ఆదేశాలు జారీ చేసింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA)లోకి వీటిని తీసుకురావొద్దని పేర్కొంది. ఈ మేరకు..
అస్సలు తీసుకురాకూడదు
‘‘అత్యాధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు గల పరికరాలను మైదానంలోకి తీసుకురాకూడదు. మొబైల్ డేటా లేదంటే వై-ఫై నెట్వర్క్ల ద్వారా.. ప్రత్యక్ష ప్రసారం, సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆడియో, వీడియోలు చేరవేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది.
కాబట్టి PMOA ప్రమాణాల ప్రకారం.. ఇలాంటి గాగుల్స్, సన్గ్లాసెస్ను ఆడియో, వీడియో రికార్డింగ్, కమ్యూనికేషన్ పరికరాల కింద పరిగణిస్తారు. కాబట్టి ఆటగాళ్లు, అధికారులు.. ఎవరూ కూడా స్మార్ట్ గాగుల్స్ను అస్సలు PMOAలోకి తీసుకురాకూడదు’’ అని బీసీసీఐ ACSU తెలిపింది.
మొబైల్ ఫోన్ చూడకూడదు
కాగా రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్ PMOAలో మొబైల్ ఫోన్ చూడటం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సైతం రోమీతో పాటు ఫోన్ స్క్రీన్ను చూశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారగా.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రోమీకి జరిమానా విధించడంతో పాటు.. వైభవ్ను మందలించింది. కాగా తాను ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ కోసం మొబైల్ చూసినట్లు రోమీ చెప్పాడని వార్తలు వచ్చాయి.


