సెంచరీ త్యాగం చేసినందుకు బాధ లేదు.. ఆ పరుగులే మమ్మల్ని గెలిపించాయి: శ్రేయస్‌ | "Dont Worry About My Hundred...":PBKS Captain Shreyas Iyer Comments After Winning The Game Against Gujarat Titans In IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: సెంచరీ త్యాగం చేసినందుకు బాధ లేదు.. ఆ పరుగులే మమ్మల్ని గెలిపించాయి: శ్రేయస్‌

Mar 26 2025 8:56 AM | Updated on Mar 26 2025 10:46 AM

IPL 2025: PBKS Captain Shreyas Iyer Comments After Winning The Game Against Gujarat

Photo Courtesy: BCCI

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ తొలి మ్యాచ్‌లోనే తన మార్కు చూపించాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా, త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్‌ కెప్టెన్సీ ప్రభావం ఈ మ్యాచ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లను మార్చడం, ఫీల్డ్‌ను సెట్‌ చేయడం, వ్యూహాలు పన్నడంలో శ్రేయస్‌ తిరుగులేని నాయకుడని మరోసారి నిరూపితమైంది. అర్షదీప్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌లను శ్రేయస్‌ అద్భుతంగా వాడుకున్నాడు. వ్యక్తిగతంగా సఫలమైన శ్రేయస్‌ సహచరుల్లో స్పూర్తి నింపడంలో కూడా సక్సెస్‌ అయ్యాడు. ఫలితంగా పంజాబ్‌ ఐపీఎల్‌లో తమ రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.

అహ్మదాబాద్‌ వేదికగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. గుజరాత్‌ నిర్ణయం తప్పని అరంగేట్రం​​ ఆటగాడు ప్రియాంశ్‌ ఆర్య ఆదిలోనే నిరూపించాడు. 24 ఏళ్ల ఈ గవర్నమెంట్‌ టీచర్‌ కొడుకు (ఆర్య) తొలి మ్యాచ్‌ ఆడుతున్నాననే బెరుకు ఏమాత్రం లేకుండా గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (8 బంతుల్లో 8; ఫోర్‌) ఆదిలోనే ఔటైనా శ్రేయస్‌ అయ్యర్‌ ఆర్యతో జతకట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్‌ పవర్‌ ప్లేలో 73 పరుగులు చేసింది.

బౌండరీతో ఖాతా ఓపెన్‌ చేసిన శ్రేయస్‌ ప్రసిద్ద్‌ కృష్ణ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో బీస్ట్‌ మోడ్‌లోకి వచ్చాడు. 3 సిక్సర్లు, బౌండరీ సహా 24 పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్‌ తొలి బంతికే బౌండరీ బాది 95 పరుగులకు చేరిన శ్రేయస్‌.. ఆతర్వాత సెంచరీ చేసే అవకాశమున్నా (11 బంతులు మిగిలున్నాయి) శాశాంక్‌ సింగ్‌కు స్ట్రయిక్‌ ఇచ్చి అతని చేత విధ్వంసం సృష్టింపజేశాడు. 

సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన శశాంక్‌.. 5 బౌండరీలు సహా 23 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్‌ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. శశాంక్‌ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్‌ ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌ కాగా.. ఒమర్‌జాయ్‌ 16, స్టోయినిస్‌ 20 పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో సాయికిషోర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 ఓవర్లలో  30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సైతం మెరుపు అరంభమే లభించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్‌ ఆటగాళ్లలో సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. 

14 ఓవర్ల వరకు గుజరాత్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేలా కనిపించింది. ఈ దశలో పంజాబ్‌ బౌలర్లు విజయ్‌కుమార్‌ వైశాక్‌, జన్సెన్‌, అర్షదీప్‌ గుజరాత్‌ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. విజయ్‌కుమార్‌ గుజరాత్‌ బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. అంతిమంగా గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ 2, జన్సెన్‌, మ్యాక్స్‌వెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం శుభపరిణామం. తొలి బంతికే బౌండరీ కొట్టాను. అదే నన్ను ముందుకు నడిపించింది. రబాడ బౌలింగ్‌లో ఫ్లిక్ సిక్స్ కాన్ఫిడెన్స్‌ను పెంపొందించింది. చివరి ఓవర్‌లో శశాంక్ చేసిన పరుగులు చాలా కీలకం. సెంచరీ మిస్‌ చేసుకున్నందుకు బాధ లేదు. మేము ఓ టార్గెట్‌ను సెట్‌ చేసుకున్నాము. దాని కోసం ముందుకు వెళ్లాము. 

వైశాక్‌ అద్భుతంగా రాణించాడు. తొలి బంతి నుంచే యార్కర్లు వేయడం ప్రారంభించాడు. యార్కర్ల ప్లాన్‌ అమలు చేయడంలో అర్షదీప్‌ కీలకపాత్ర పోషించాడు. బంతి రివర్స్‌ స్వింగ్‌ అవుతుందని అర్షదీప్‌ చెప్పాడు. బంతికి ఉమ్ము రాయడం కలిసొచ్చిందని అనుకుంటున్నాను. అర్షదీప్‌ సాయి సుదర్శన్‌ను ఔట్‌ చేయడంతో మా గెలుపుకు బీజం పడింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement