పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం లహోర్ వేదికగా కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఖలందర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, ఆల్ రౌండర్ సికందర్ రజా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై స్థానిక పోలీసులు సీరియస్ అయ్యారు. లహోర్ డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏమి జరిగిదంటే?
షాహీన్ అఫ్రిది సారథ్యంలోని ఖలందర్స్ జట్టు లహోర్లోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే సికిందర్ రజా తన ఉండే గదిలోకి నలుగురు గెస్ట్లను అనుమతించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరాడు. కానీ అతడు చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఈ విషయంలో లాహోర్ ఖలందర్స్ యజమాని సమీన్ రాణా కూడా జోక్యం చేసుకున్నారు.
ఆ నలుగురును అనుమతించాలని సీఈఓ నసీర్ను సమీన్ అభ్యర్ధించాడు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ విన్నపాన్ని అధికారులు తోసిపుచ్చారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టిమరి షాహీన్, రజా ఆ నలుగురిని హోటల్ లోపలికి తీసుకెళ్లారు.
ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని సీఈఓ సల్మాన్ నసీర్కు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై లాహోర్ ఖలందర్స్ మీడియా హెడ్ ఉమర్ ఫరూక్ స్పందించారు.
మా ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన ఈ ఘటనపై మాకు స్పష్టత ఉంది. మేమే పీఎస్ఎల్ మేనెజ్మెంట్తో చర్చలు జరపుతున్నాము అని ఉమర్ ఫరూక్ తెలిపారు. అయితే షాహీన్, రజాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.


