క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్‌’లో కూడా.. గ్రీన్‌ సిగ్నల్‌ | IOC Approves Cricket Inclusion In 2028 Los Angeles Games | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త.. ‘ఒలింపిక్స్‌’లో క్రికెట్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. ఏ ఫార్మాట్‌లో అంటే?

Oct 13 2023 4:18 PM | Updated on Oct 13 2023 4:46 PM

IOC Approves Cricket Inclusion In 2028 Los Angeles Games - Sakshi

టీమిండియా

Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.  ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్‌ బాష్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్‌ కూడా ఉందని వెల్లడించారు.

ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్‌ కూడా
కాగా ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌(నాన్‌- కాంటాక్ట్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌), స్క్వాష్‌, లాక్రోస్‌లతో పాటు క్రికెట్‌ కూడా చేర్చనున్నారు.

కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మీటింగ్‌ రెండో రోజున థామస్‌ బాష్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర
ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్‌ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్లోనే గోల్డ్‌ మెడల్స్‌ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఒలింపిక్స్‌లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది.

చదవండి: WC 2011లో నేనే కెప్టెన్‌ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ!

Advertisement
 
Advertisement
Advertisement