జెమీమా రోడ్రిగ్స్ (PC: BCCI)
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది.
రాణించిన యస్తికా, జెమీమా
ఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.
మిగిలిన వారిలో ఆల్రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
చెలరేగిన బౌలర్లు
ఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.
భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


