బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు.
అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు.
జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.


