అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ నెల ఏప్రిల్ 10న అనంత్కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..
బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు.
కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది.
దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.
నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు.
నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.
(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..)


