
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్ నమోదు చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. భారత టెస్టు జట్టు కెప్టెన్గా గిల్ పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో టీమిండియా తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సారథిగా తొలి ప్రయత్నంలో విఫలమైన గిల్.. బ్యాటర్ (147, 8)గా మాత్రం అదరగొట్టాడు. ఇక రెండో టెస్టులో ఎడ్జ్బాస్టన్లో భారత్ ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన చారిత్రాత్మక విజయం సాధించడంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ది కీలక పాత్ర.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ (269), శతకం (161)తో చెలరేగాడు గిల్. అయితే, లార్డ్స్ టెస్టు (16, 6)లో మాత్రం అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ గిల్ తొలి ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న ప్రిన్స్.. 12 పరుగులు చేసి నిష్క్రమించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్లో మాత్రం గిల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా 18 ఓవర్ల ఆట ముగిసే సరికి 46 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 39 పరుగులు రాబట్టాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్గా అవతరించాడు. ఈ ఇన్నింగ్స్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్.. యూసఫ్ను అధిగమించాడు.
ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు
🏏శుబ్మన్ గిల్ (ఇండియా)- 645*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269
🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202
🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149
🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.
చదవండి: తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్