IND VS ENG 2nd ODI: విండీస్‌ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్‌-ధవన్‌ జోడీ

IND VS ENG 2nd ODI: Rohit Sharma, Shikhar Dhawan Need 43 Runs To Become 3rd Most Successful ODI Opening Pair - Sakshi

Rohit-Dhawan: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌లు మరో అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఈ ద్వయం మరో 43 పరుగులు జోడిస్తే.. విండీస్‌ దిగ్గజ ఓపెనర్ల రికార్డును అధిగమిస్తారు. వన్డేల్లో విండీస్‌ లెజెండరీ ఓపెనింగ్‌ పెయిర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ జోడీ తొలి వికెట్‌కు 102 ఇన్నింగ్స్‌ల్లో 5150 పరుగులు జోడించగా.. రోహిత్‌-ధవన్‌ జోడీ 112 ఇన్నింగ్స్‌ల్లో 5108 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో నేటి (జులై 14) మ్యాచ్‌లో భారత ఓపెనింగ్‌ ద్వయం మరో 43 పరుగులు సాధించగలిగితే.. వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. 

ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీ జోడీ (136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఓపెనింగ్‌ జోడీ మాథ్యూ హేడెన్‌-ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472) రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి వన్డేలో హిట్‌మ్యాన్‌- ధవన్‌ పెయిర్‌ తొలి వికెట్‌కు అజేయమైన 114 పరుగులు సాధించడం ద్వారా ఫిఫ్టి ఓవర్స్‌ ఫార్మాట్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుంది. 

ఇదిలా ఉంటే, తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు బుమ్రా (6/19), మహ్మద్‌ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 110 పరుగులకే చాపచుట్టేసింది. ఛేదనలో రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. 
చదవండి: విండీస్‌తో టి20 సిరీస్‌.. కోహ్లి, బుమ్రా ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top