Photo Courtesy: IPL 2026
క్రికెటర్లకు అభిమానులుండడం సహజం. కానీ మాజీ క్రికెటర్ కూతురు మరో క్రికెటర్కు అభిమానిగా ఉండడం, అతడిని కలవాలని కోరడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. టీమిండియా మాజీ క్రికెటర్ వృద్దిమాన్ సాహా, అతడి కూతురు అన్వి మధ్య జరిగిన సంభాషణను సాహా భార్య రోమి మిత్రా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సాహా, కూతురు అన్వి మధ్య సంభాషణ ఆద్యంతం ఆకట్టుకుంది.
విషయంలోకి వెళితే.. అన్వి శుబ్మన్ గిల్కు అభిమాని. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ను కల్పించాలాంటూ అన్వి పదే పదే తండ్రి సాహాను రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిపై సాహా కూతురుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ‘గిల్ను కలవాలనుకోవడం ఓకే. కానీ అందరిలానే లైన్లో నిలబడి అతడిని కలవాల్సి ఉంటుంది.
ఇందులో నీకు ఎలాంటి మినహాయింపు ఉండదు’ అని సాహా తన కూతురితో పేర్కొన్నాడు. అందుకు అన్వి.. ‘అదేంటి.. మీరు గిల్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారుగా’ అని గుర్తుచేసింది. దానికి సాహా ‘అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడడం లేదు కదా’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణను సాహా భార్య రోమి మిత్రా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.
కాగా సాహా గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున గిల్తో కలిసి ఇన్నింగ్స్లు పంచుకున్న సంగతి తెలిసిందే. వృద్దిమాన్ సాహా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాహా సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఒక ఐపీఎల్ సీజన్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సాహా రికార్డులకెక్కాడు.
ఐపీఎల్ కెరీర్లో 170 మ్యాచ్లాడిన సాహా 2,934 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా 13 అర్థశతకాలున్నాయి. ధోని హయాంలో పెద్దగా వెలుగులోకి రాలేకపోయిన వృద్దిమాన్ సాహా టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డే మ్యాచ్లు ఆడాడు. 2024 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడిన సాహా ఆ తర్వాత అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
2024-25 రంజీ సీజన్లో పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా బెంగాల్ ఆటగాళ్లు సాహాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. సాహా తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 142 మ్యాచ్లాడి 7 వేలకు పైగా పరుగులు సాధించాడు.
చదవండి: నడిరోడ్డుపై చాహల్ హల్చల్!


