పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో వరుస విజయాలతో దూసుకు పోతున్న కరాచీ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ కింగ్స్ గురువారం పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు కరాచీ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు డ్రండ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వార్నర్ ఏప్రిల్ 7న కరాచీ కింగ్స్ జట్టుతో తిరిగి చేరాల్సింది.
కానీ అతడు ఇంకా పాకిస్తాన్కు రానిట్లు తెలుస్తోంది. ఈరోజు పెషావర్ జల్మీతో జరగనున్న కీలక మ్యాచ్కు వార్నర్ అందుబాటులో లేకపోవడంతో, కరాచీ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్గా పేసర్ హసన్ అలీ వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
అసలేమి జరిగిందంటే?
కరాచీ కింగ్స్ జట్టుకు వారం రోజులు విశ్రాంతి లభించడంతో వార్నర్ తన కుటుంబంతో సమయం గడపడానికి పాక్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ క్రమంలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో వార్నర్ దొరికిపోయాడు.
వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్ణీత పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాతి అతడిని విడిచిపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాగా పెషావర్ జల్మీతో మ్యాచ్కు దూరంగా ఉన్నప్పటికి కరాచీ ఆడే తదుపరి మ్యాచ్కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: IPL 2026: 'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'


