పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.
ప్రేక్షకులు లేకుండానే..
ఆరంభ మ్యాచ్లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్లలో మాత్రమే మ్యాచ్లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
ఈ విషయం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్బజ్తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్లో ఉన్న మా హై కమిషన్ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.
కాగా మరోసారి ఐపీఎల్కు పోటీగా పాక్ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.
చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం


