ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావల్పిండి వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1000వ వన్డేను మధురానుభూతిగా మల్చుకుంది. మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన బాబర్ ఆజంకు అవమానం జరిగింది.
పాక్ వెయ్యి వన్డేలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ జట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్) సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజంకు చోటు దక్కలేదు. 1992 వన్డే వరల్డ్కప్ సాధించిన పాక్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ఖాన్ను కెప్టెన్, ఆల్రౌండర్ స్లాట్కు ఎంపిక చేశాడు.
ఇక బ్యాటర్గా బాబర్ ఆజం కాకుండా సయీద్ అన్వర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రషీద్ లతీఫ్ను, ఫాస్ట్ బౌలర్ కోటాలో వసీమ్ అక్రమ్ను, స్పిన్నర్ కోటాలో సక్లెయిన్ ముస్తాక్ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థసెంచరీలు సాధించారు.
అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 42.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, మార్నస్ లబుషేన్ తలా ఒక వికెట్ తీశారు.


