
ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం
ఇంగ్లండ్ పర్యటనలో అందరి దృష్టి అతడిపైనే
రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటున్న కర్ణాటక ప్లేయర్
‘ప్రియమైన క్రికెట్... నాకు మరో అవకాశం ఇవ్వు’... ఇది 2022 డిసెంబర్లో కరుణ్ నాయర్ చేసిన ట్వీట్! జాతీయ జట్టు తరఫున ఆడిన మూడో టెస్టులోనే ‘ట్రిపుల్ సెంచరీ’ చేసి రికార్డులు తిరగరాసిన కరుణ్ నాయర్... ఆ తర్వాత లైమ్ లైట్లో లేకుండా పోయాడు. కెరీర్లో తొలి శతకాన్నే మూడొందలుగా మార్చినా... ఆ మరుసటి మ్యాచ్లోనే అతడికి తుది జట్టులో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత టీమిండియా ఆడిన వరుస మూడు మ్యాచ్ల్లో ఆడినా... వాటిలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు! దీంతో సెలెక్టర్లు అతడి పేరు పరిశీలించడమే మానేశారు.
అయినా పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ వచ్చిన కరుణ్ నాయర్... దేశవాళీల్లో టన్నులకొద్దీ పరుగులు చేసి తిరిగి జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం వచ్చిన ‘సెకండ్ చాన్స్’ను సద్వినియోగ పరుచుకుంటూ ఇంగ్లండ్తో సిరీస్లో సత్తా చాటేందుకు నాయర్ సమాయత్తమవుతున్నాడు. –సాక్షి క్రీడావిభాగం
‘ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ ఇది కరుణ్ నాయర్ తాజా వ్యాఖ్య. ఈ నెల 20 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికైన కరుణ్ నాయర్... సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన చాన్స్ను పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నాడు.
2024–25 రంజీ సీజన్లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. దీంతో విదర్భ జట్టు రంజీ చాంపియన్గా నిలవగా... అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలోనూ నాయర్ దుమ్మురేపాడు. 8 ఇన్నింగ్స్ల్లో 389.50 సగటుతో 779 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో 5 శతకాలు ఉండటం విశేషం.
ఈ ప్రదర్శన అతడిని మరోసారి వెలుగులోకి తేగా... తాజా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో ఖాళీ ఏర్పడగా... ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉన్న కరుణ్ను సెలెక్టర్లు తిరిగి జట్టుకు ఎంపిక చేశారు.
అనధికారిక టెస్టులో ‘డబుల్’
ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టులోనూ నాయర్ ఆకట్టుకున్నాడు. తొలి ప్రాక్టీస్ పోరులో మూడో స్థానంలో బరిలోకి దిగి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనతో తొలి టెస్టులో కరుణ్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్టు క్రికెట్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన రెండో ప్లేయర్గా నిలిచిన నాయర్... సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
2016లో ఇంగ్లండ్తో మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నాయర్... తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా 4, 13 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న నాయర్.. చెన్నై పిచ్పై ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న మైదానంలో తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ అండతో భారీ ఇన్నింగ్స్ ఆడి... కెరీర్లో తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచాడు.
అయితే అప్పటికే టీమిండియా సిరీస్ కైవసం చేసుకోగా... ఎక్కువ ఒత్తిడి లేని మ్యాచ్ కావడంతోనే నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’ చేయగలిగాడనే వార్తలు వినిపించాయి. ఎవరేమన్నా... స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ మూడొందల పరుగులు చేయడం అంటే... ఎలాంటి స్థితిలో అయినా అషామాషీ కాదనేది వాస్తవం.
యువ ఆటగాళ్లకు పెద్దన్నలా...
నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’ అనంతరం బంగ్లాదేశ్తో టీమిండియా ఆడిన ఏకైక టెస్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు నాయర్ను ఎంపిక చేసినా... అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టుల్లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్క్ దాటలేకపోయాడు. దీంతో అతడికి మరో అవకాశం దక్కలేదు. 2018 ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా... ఐదు మ్యాచ్ల్లోనూ బెంచ్కే పరిమితమయ్యాడు.
అప్పటికే సిరీస్ కోల్పోయిన అనంతరం జరిగిన ఆఖరిదైన ఐదో టెస్టులో సైతం నాయర్కు అవకాశం ఇవ్వకుండా... తెలుగు ఆటగాడు హనుమ విహారిని భారత్ నుంచి రప్పించి మరీ అరంగేట్రం చేయించారు. ఇక అప్పటి నుంచి రేసులో వెనుకబడిపోయిన నాయర్... దేశవాళీ ధనాధన్తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. అయితే గతంతో పోలిస్తే షాట్ల ఎంపికలో కచ్చితత్వం... బ్యాటింగ్లో నిలకడ... అనుభవం అతడిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో నాయర్ కీలకం కాగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జట్టులో అందరికంటే సీనియర్ అయిన కేఎల్ రాహుల్కు నాయర్తో మంచి అనుబంధం ఉండగా... ఈ పర్యటనలో ఈ కన్నడ జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి.
2023–24 సీజన్లలో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో నార్తంప్టన్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నాయర్ 56.61 సగటుతో 736 పరుగులు చేశాడు. అక్కడి పరిస్థితులపై చక్క టి అవగాహన ఉన్న నాయర్... యువ ఆటగాళ్లకు పెద్దన్నలా వ్యవహరిస్తే ఈ సిరీస్లో టీమిండియాకు సానుకూల ఫలితాలు దక్కే అవకాశం ఉంది.