● కలెక్టర్ హైమావతి ● గజ్వేల్లో అధికారులతో సమీక్ష
గజ్వేల్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) భూ సేకరణను పూర్తి చేసి, భూములను నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ)కి అప్పగించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలోని జగదేవ్పూర్, మర్కూక్, గజ్వేల్, వర్గల్, రాయపోల్ మండలాల నుంచి ట్రిపుల్ఆర్ నిర్మాణం జరగనుందని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, సహకారాన్ని కోరాలని చెప్పారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించి రైతులు ఎలాంటి పంటలు వేయకుండా స్వాధీనం చేసుకో వాలని తెలిపారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. ఇంకా ఈ సమీక్షలో గజ్వేల్ ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


