సిద్దిపేటకమాన్: ఆరు గ్యారంటీలని చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై శనివారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం 97జీఓ రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, 2లక్షల ఉద్యోగాల సంగతిపై అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. రైతు బీమా, ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడ పోయాయని, కేసీఆర్ తెచ్చిన అన్ని స్కీమ్లు బంద్ చేశారన్నారు. సిద్దిపేట ప్రజల కోసం శిల్పారామం, రంగనాయక సాగర్ టూరిజం అభివృద్ధి చేస్తుంటే వాటి పనులను ఆపారన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం కాదని, నాపై పెట్టుకోండని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ.20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, ఫార్మసీ, లా తదితర కోర్సుల్లో చదివించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ కాస్తా ‘జాబ్ లెస్’ క్యాలెండర్ అయిపోయిందని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని, 16వేలు మాత్రమే ఇచ్చారన్నారు. ఏడు గంటల కరెంట్ కూడా వస్తలేదని వరిచేనులు ఎండిపోయి వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతానన్నారు. కాగా నిరసన కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులు హరీశ్రావుతో సెల్పీలు దిగడానికి పోటీ పడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవిందర్రెడ్డి, పాల సాయిరాం, బీఆర్ఎస్, విద్యార్థి విభాగం నాయకులు, భారీ సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
97జీఓ రద్దుకు అసెంబ్లీలో పోరాడుతా
రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఏమయ్యాయి?
మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్
నా టైమ్ వస్తే ఊరుకుంటానా..!
సిద్దిపేటజోన్: ‘సీఎం రేవంత్ రెడ్డి.. మీకు సిద్దిపేట మీద ఎందుకు అంతా కోపం.. ప్రస్తుతం మీ టైమ్ నడుస్తోంది.. రెండేళ్లు ఆగితే మా టైమ్ వస్తుంది. అప్పుడు ఊరుకుంటానా.. వెటర్నరీ కళాశాలను తిరిగి వెనక్కి తీసుకొస్తా.. నా ప్రాణం ఉన్నంతవరకు ఇంకా సిద్దిపేట అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటా’నని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విపంచి ఆడిటోరియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా విద్య, వైద్యం పరంగా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. సిద్దిపేటలో తన కోరిక మేరకు అప్పటి సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.


