ఉపాధ్యాయుల గొప్పతనంపై విద్యార్థుల మనోభావాలు ● నేడు గురుపూజోత్సవం
అక్షరాలు నేర్పడమే కాదు.. జీవితంలో ఎలా ఎదగాలో మార్గం చూపించే దిక్సూచి కూడా ఉపాధ్యాయుడే. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాలపై అత్యధిక ప్రభావం చూపేది గురువులే. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ, సమయపాలన, పెద్దలను గౌరవించడం వంటి జీవిత విలువలను తమ గురువులు నేర్పుతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. చదువులో వెనుకబడినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించి పాఠాలు చెప్పడం, తమలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పోటీ పరీక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుకు సాగేలా ధైర్యం చెప్పడం వంటి ఎన్నో విషయాలను పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు గురు పూజోత్సవం సందర్భంగా తమకు ఇష్టమైన ఉపాధ్యాయులు, పొందిన ప్రయోజనాలు, నేర్చుకున్న పాఠాలను చిన్నారులు తమ మాటల్లో వివరించారు ఇలా.. – సాక్షి, సిద్దిపేట
నంగునూరు(సిద్దిపేట): పాఠశాలలో నిర్వహించే కల్చరల్ కార్యక్రమాల్లో బాగా ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచేలా చేసి తీర్చిదిద్దారు. అలాగే నర్మెటలో అయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడే అవకాశం కల్పించి నాలో స్ఫూర్తిని నింపారు. దీంతో నా ఫెవరెట్ టీచర్ అశోక్ అయ్యారు. అశోక్ సార్ మార్గదర్శకత్వంలో బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తా. తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకువస్తా.
– గూడెపు కారుణ్య, పదో తరగతి, నర్మేట


