గజ్వేల్రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలోగల మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేయాలని టీజేఎస్(తెలంగాణ జనసమితి) జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ముంపు (వేములఘట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి)గ్రామాల్లో ఇంటింటి పర్యటన చేపట్టి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్వామి మాట్లాడుతూ పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముంపు గ్రామాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. అదే విధంగా ప్యాకేజీలు, పరిహారం అందని వారికి న్యాయం చేస్తూ ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గజ్వేల్కు చేసిందేమీలేకపోగా, కేసీఆర్ హాయాంలో మంజూరైన రూ.180కోట్ల నిధులను రద్దు చేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలకు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టారని చెప్పారు. జిల్లాకు ఒక ఇన్చార్జి మంత్రి, మరో మంత్రి ఉన్నా...ప్రయోజనం లేదన్నారు. గజ్వేల్ కాంగ్రెస్లో ఉన్న కుమ్ములాటలను ముందుగా సరిదిద్దుకొని...బీఆర్ఎస్ గురించి మాట్లాడాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, బీఆర్ఎస్ నేతలు గంగిశెట్టి రవి, నర్సింగరావు, మల్లేశం, మద్దూరి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
టీన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్
సిద్దిపేటజోన్: ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్రెడ్డి అన్నారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన సెప్టెంబర్10 ఛలో హైదరాబాద్ సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇది ఉద్యోగుల భవిష్యత్తు.. మన పిల్లల కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. ఈనెల10లోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, సుకుమారీ, విజయ్భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


