● మూడు గర్భగృహాలు ● 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయుల కాలానికి చెందిన హిందూ దేవాలయం
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో త్రికూటాలయం అనే దేవాలయం ఉంది. ఇది కాకతీయుల కాలానికి చెందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. త్రికూటాలయం శైలిలో నిర్మించిన ఈ దేవాలయంలో మూడు గర్భగృహాలు ఒకే మండపానికి అనుసంధానమై ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్తకు చేరుకుని పాడుబడ్డ బంగ్లా స్థాయిలో దర్శనమిస్తోంది.
ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించండి
‘పల్లె పల్లెకు పొన్నమన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాకతీయుల కాలంలో నిర్మించిన త్రికూటాలయ దేవాలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పొన్నం గ్రామ పర్యటనకు రానున్న క్రమంలో గ్రామ సర్పంచ్ కొడముంజ బాలరాజు ఆదివారం త్రికూటాలయ ఆవరణంలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు పిచ్చిమొక్కలను శుభ్రం చేయించారు. తప్పకుండా స్థానిక, ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టిసారించి ఆలయా అభివృద్ధికి నిధులు కేటాయించి, దేవాలయ రూపురేఖలు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.


