‘ప్రజాపాలన’తో మంచి ఫలితాలు ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులశాఖ మంత్రి వివేక్ గజ్వేల్లో ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ చెక్కుల పంపిణీ
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులశాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. ఆదివారం గజ్వేల్లోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో గజ్వేల్ నియోజకవర్గంలోని 1109మంది లబ్ధిదారులకు రూ.11.9కోట్ల విలువైన ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ చెక్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయ డంలో భాగంగానే ఇంటర్ కళాశాలల్లోనూ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గానికో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ.200కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. యాసంగి సీజన్లో అనుకున్న దానికంటే 30శాతం ధాన్యం దిగుబడులు అధికంగా రావడం వల్ల కొనుగోళ్ల ల్లో ఇబ్బందులు వస్తున్నాయని, అయినా సమస్యలను పరిష్కరించి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని చెప్పారు.
చెక్కుల పంపిణీలో జాప్యాన్ని నివారించండి
‘కల్యాణలక్ష్మి’ చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొనడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారని, ఈ పరిస్థితి రాకుండా ప్రతి ఆరు నెలలకోసారి పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. అదేవిధంగా పథకంలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. కాగా రూ.2.56కోట్ల వ్యయంతో గజ్వేల్ పట్టణంలో నిర్మించిన బస్బేను మంత్రి వివేక్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
మద్దూరు(హుస్నాబాద్): భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని హైకోర్టు న్యాయవాది కదిరె కృష్ణ అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండలం జాలపల్లిలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని కదిరె కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. జాంబవ యూత్ అధ్యక్షులు నాగుపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థను నిర్మూలించి, సమసమాజ స్థాపన కోసం అంబేడ్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో దళితులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, సర్పంచ్ చెట్కూరి కమలాకర్యాదవ్, కొమ్ము రవి,ఇట్టబోయిన కనుకచంద్రం, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బూర గంగాధర్, ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్, నాగులపల్లి రాములు, ఎమ్మార్పిఎస్ నాయకులు సుందరగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


