హత్నూర(సంగారెడ్డి): వచ్చేనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హత్నూర మండలం బోరుపట్ల శివారులోని నూతనంగా నిర్మించిన తెరానియం బయోలాజిక్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లను శనివారం ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే పరిశ్రమను పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాలు, సభ ఏర్పాట్లు చేసే హాల్ను, హెలిప్యాడ్ను ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఖాళీ స్థలాన్ని కూడా హెలీప్యాడ్ స్థలం కోసం ఎస్పీ పరిశీలించారు. పరిశ్రమ వెనుకభాగంలోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవీందర్, ఎస్సై శ్రీధర్రెడ్డి, ఆర్ఐ హరిబాబు అధికారులున్నారు.


