మిరుదొడ్డి(దుబ్బాక): నిలిచిపోయిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం మిరుదొడ్డిలోని పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా కొనుగోళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దళారులను ఆశ్రయించి క్వింటాలుకు సుమారు రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. రైతుల సమస్యలను తెలుసుకున్న కోదండరెడ్డి స్పందిస్తూ పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


