● అట్టహాసంగా ప్రోమో రన్ ● హాజరైన న్యాయమూర్తి సంతోష్ కుమార్, అదనపు డీసీపీ సుభాష్
సిద్దిపేటజోన్: ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కోమటిచెరువు పైన తెలంగాణ రన్నర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రోమో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరి వాకింగ్, రన్నింగ్, వ్యాయాయం, వంటి శారీరక కార్యకలాపాలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం, యువతను ఫిట్నెస్ వైపు ప్రోత్సాహించడం లక్ష్యంగా ప్రోమో రన్ ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. జూన్7న హైదరాబాద్ లో నిర్వహించనున్న అవంతిక తెలంగాణ రన్ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రోమో రన్ చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రోమో రన్ లో పెద్ద ఎత్తున రన్నర్స్, యువత, విద్యార్థులు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు జగన్ మోహన్రెడ్డి, రాజు,బాపురెడ్డి, రవి, సుజాత, హరి, తదితరులు పాల్గొన్నారు.


