● పరిష్కరించేందుకు అధికారులుచొరవచూపాలి ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ప్రజలు అందించే అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు పరిష్కరించాలన్నారు. వచ్చే ప్రజావాణి నుంచి విభాగాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 98 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తాలు తీసాకే ధాన్యం కొనుగోలు
తప్పనిసరిగా తాలు తీసిన తర్వాతే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం రూరల్ మండలం పుల్లూరు, రాఘవపూర్, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ శాతం వచ్చే వరకు వ్యవసాయ క్షేత్రాల వద్దనే ఆరబెట్టుకోవాలన్నారు. తాలు తీసాకే ధాన్యానికి గ్రేడ్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతిలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


