న్యూస్రీల్
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ఈఎల్స్తో పాటు గౌరవ వేతనం ఇస్తుండటంతో ఉపాధ్యాయుల మొగ్గు ● జిల్లాలో జనగణనకు 2,005 మంది ఎన్యూమరేటర్లు, 353 మంది సూపర్వైజర్లు
సిద్దిపేట పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దుబ్బాక పట్టణంలో ఎన్యూమరేటర్ డ్యూటీ కోసం డీఈఓకు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇలా ఒక్కరు కాదు.. అర్హత లేని వారు సైతం పైరవీ చేసుకుని ఎన్యూమరేటర్ డ్యూటీని వేయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలో జనగణన వేళ పైరవీల గోల నెలకొనడం గమనార్హం.
–సాక్షి, సిద్దిపేట
జన గణనలో ఎన్యూమరేటర్లకు గౌరవ వేతనంతో పాటు దాదాపు నెల రోజులు ఈఎల్స్ ఇస్తుండటంతో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నారు. ఈ డ్యూటీల కోసం ఉపాధ్యాయులు జోరుగా పైరవీలు చేయించుకుంటున్నారు. జన గణన–2027 కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా మే నెలలో ఇళ్ల గుర్తింపు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కలు జరగనున్నాయి. అందులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పొషించనున్నారు. 2,005 మంది ఎన్యూమరేటర్లు, 353 మందిని సూపర్వైజర్లుగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు.
ఏ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు అదే మండలంలో ఎన్యూమరేటర్లుగా నియమించాలి. ఆ బాధ్యతలను స్థానిక ఎంఈఓలకు అప్పగించారు. గతంలో ఎన్నికల విధులు, పదో తరగతి పేపర్ వాల్యూవేషన్, ఇతర కార్యక్రమాల్లోని పాల్గొని, సీనియారిటీ ఆధారంగా నియమించాలని విద్యాశాఖ ఆదేశించింది. పలు చోట్ల ఎంఈఓలు పైరవీలకే ప్రాధాన్యం వేస్తున్నారు. ఎన్యూమరేటర్ల నియామకాల్లో ఎంఈఓలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్జీటీలను ఎన్యూమరేటర్లు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలను సూపర్వైజర్లును నియమించాలి. కానీ కొన్ని చోట్ల స్కూల్ అసిస్టెంట్లను ఎన్యూమరేటర్లుగా నియమించారని తెలుస్తోంది.
త్వరలో శిక్షణ
వేసవి సెలవుల్లో విధులు నిర్వహించినందుకు ఉపాధ్యాయులకు గౌరవ వేతనంతో పాటు సంపాదిత సెలవులు(ఈఎల్) వారి వేతనంలో జమ అవుతాయి. దాదాపు నెల రోజుల ఈఎల్లు వేతనానికి జోడించడంతో ప్రయోజనం కలగనుంది. దీంతో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల డ్యూటీ కోసం ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు మక్కువ చూపారు. జాబితాలను తయారు చేసి మండలాల్లో అయితే తహసీల్దార్లకు, పట్టణాలల్లో మున్సిపల్ కమిషనర్లకు ఎంఈఓలు అందించారు. త్వరలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం చేసిన జాబితాను మరోసారి పరిశీలించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగానే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపిక జరిగిందని మాస్టర్ ట్రైనర్ రామస్వామి తెలిపారు.


