నందిని సిధారెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎంతో మంది గొప్ప వ్యక్తులను, ఉద్యమ నాయకులను, గాయకులను, కళాకారులను అందించిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు కాపురాజయ్య, వేముగంటి నరసింహాచార్యులు రెండు కళ్లలాంటి వారిని అందించి తెలంగాణ చైతన్యానికి సిద్దిపేట మూలకందంగా నిలిచి నేటి యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు. యవతరం పరిశోధానసక్తిని పెంపొందిందుకుని జిల్లా కళలు, సంస్కృతి, చరిత్రను పరిరక్షించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది సిధారెడ్డి సిద్దిపేటకు వన్నె తెచ్చారని కొనియాడారు. కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్ లాంటి ఎంతో మంది సాహితీవేత్తలు కళాశాల పూర్యవిద్యార్థులు అయినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సదస్సు సంచాలకులు ప్రొఫెసర్ మట్టా సంపత్కుమార్రెడ్డి, నర్రా భగవాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
దుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్లో రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల సిద్దోగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వెంకటయ్యను శాలువతో సన్మానించారు.
అనంతసాగర్కు సాగు నీరు తీసుకువస్తా: ఎంపీ
చిన్నకోడూరు(సిద్దిపేట): అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని అనంతసాగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. రంగనాయక సాగర్ నుంచి చౌడారం వరకు ఉన్న కాలువ పనులు త్వరగా పూర్తి చేసి అనంతసాగర్కు సాగు నీరు వచ్చేలా కృషి చేస్తానన్నారు. సంబంధిత అధికారులతో అక్కడే ఫోన్లో మాట్లాడి కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.


