
ఉపాధి ఈకేవైసీలో జిల్లా రెండో స్థానం
అక్కన్నపేట(హుస్నాబాద్): ఉపాధి కూలీల ఈకేవైసీలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కూలీలకు ఈకేవైసీ నమోదు చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కూలీలు తమ ఆధార్కార్డులను జాబ్కార్డులతో ఈకేవైసీ చేసుకుంటేనే పని కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,24,300జాబ్కార్డు ఉండగా 2,09,506మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1,54,692మంది కూలీల ఈకేవైసీ పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా రెండోవ స్థానంలో నిలిచింది. 1,79,000కూలీల ఈకేవైసీతో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అక్కన్నపేట మండలంలో ఉపాధి హమీ కూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను యాప్లో అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు జోరుగా నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పని కల్పించడం ఇకనుంచి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. అలాగే కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.
జిల్లావ్యాప్తంగా
1,54,692మంది కూలీలు
యాప్లో జోరుగా
ముఖ గుర్తింపు ప్రక్రియ
కొత్త విధానంతో మరింత పారదర్శకత
మండలాల్లో ఈకేవైసీ ఇలా..
జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందులో గజ్వేల్లో 82శాతం, మద్దురూలో 81, అక్కన్నపేటలో 79, భూంపల్లిలో 69, బెజ్జంకిలో 79, చేర్యాలలో 78, చిన్నకోండూర్లో 75, దూల్మిట్టలో 35శాతం ఈకేవైసీ పూర్తయింది. అలాగే దౌల్తాబాద్లో 67శాతం, దుబ్బకలో 71, హుస్నాబాద్లో 71, జగదేవపూర్లో 72, కోహెడలో 74, కొమురవెల్లిలో 79, కొండపాకలో 76, కుకునూరుపల్లిలో 43, మర్కూక్లో 67, మిరుదొడ్డిలో 76, ములుగులో 73, నంగునూర్లో 85, నారాయణపేటలో 72, రాయిపోల్లో 72, సిద్దిపేట రూరల్లో 66, సిద్దిపేట అర్బన్లో 76, తొగుటలో 78, వర్గల్లో 67శాతం చొప్పున కూలీల ఈకేవైసీలను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 74శాతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీలను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.