
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గడువు లేదు
జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
ప్రశాంత్నగర్( సిద్దిపేట): వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువును ప్రభుత్వం విధించలేదన్నారు. సెప్టెంబరు 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వాహనదారులు నమ్మవద్దన్నారు.
మల్లన్న సన్నిధిలో
పాట్నా హైకోర్టు జడ్జి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్జి జస్టిస్ సాధన, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో నాకాబందీ
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి –కల్లెపెల్లి రోడ్డులో ఎస్ఐ సౌజన్య ఆధ్వర్యంలో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు పరిశీలించారు. నిబంధన లు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు.
గణేశ్కు నిఫా పురస్కారం
తొగుట(దుబ్బాక): అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిఫా (నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ జిల్లా స్థాయి అవార్డును మండల పరిధిలోని వెంకట్రావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త బండకాడి గణేశ్ అందుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచి ఆదివారం కరీంనగర్లో అందుకున్నారు. గణేష్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన నిఫా రాష్ట్ర అధ్యక్షుడు యాదవ రాజుతో పాటు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గడువు లేదు