
పర్యావరణాన్ని కాపాడుకుందాం
డీపీఓ దేవకిదేవి
కొమురవెల్లి(సిద్దిపేట): పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని డీపీఓ దేవకిదేవి అన్నారు. సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీడీఓ శ్రీనివాస వర్మతో కలిసి ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యం నుంచి భూమిని కాపాడుకోవాలని అన్నారు. మనిషి జీవితం పూర్తిగా భూమిపై ఆధారపడి ఉందని, మనం తీసుకునే ఆహారం, తాగునీరు వంటి ప్రధాన అవసరాలన్ని భూమియే సమకూరుస్తోందని అన్నారు. భూమిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడమే మార్గమన్నారు. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిళ్లు, బ్యాగులు మాత్రమే వాడాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్పై సమీక్షించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.