
గజ్వేల్.. మరో టెర్మినల్!
రైల్వేస్టేషనే ప్రత్యామ్నాయం
● హైదరాబాద్లోని స్టేషన్లలో పెరిగిన రద్దీ ● ఈ ప్రాంతంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ● మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి.. ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే మహర్దశే
గజ్వేల్ రైలు మార్గం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రత్యామ్నాయం కాబోతున్నది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరగడం, అభివృద్ధి పనుల పేరిట తరుచూ రైళ్లను మళ్లించాల్సి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గజ్వేల్ రైల్వేస్టేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయి, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది.
గజ్వేల్: మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవునా ఈ న్యూ బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారుతోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 75కిలోమీటర్లకుపైగా పనులు పూర్తికాగా ప్యాసింజర్ రైలు కూడా నడుస్తోంది. గజ్వేల్ వరకు గూడ్స్ రైలు విజయవంతంగా నడుపుతున్నారు. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జోరుగా సాగుతున్నాయి.
‘గ్రాండ్ టంక్ లైన్’తో అనుసంధానం
ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్లైన్కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది.
రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్లాట్ఫామ్లను మూసేశారు. అంతేకాకుండా పలు రైళ్లను చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. కొన్ని నెలలపాటు ప్రయాణికులకు ఈ అసౌకర్యం తప్పేలా లేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేద్దామనే ఆలోచన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారుల్లో మొదలైంది. ఇలాంటి తరుణంలో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రాంతమే ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా స్టేషన్లలో రద్దీ పెరగటం వల్ల, మరిన్ని కొత్త రైళ్లను నడపడానికి అవకాశంలేని సందర్భాల్లో నగరానికి సుమారుగా 50కిలోమీటర్ల దూరంలోపే ఉన్న గజ్వేల్ నుంచి ప్రధాన రైళ్లు నడిపితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. ఇక్కడి నుంచే కొన్ని ప్రధాన రైళ్లు అంటే తిరుపతి, బెంగళూరు, ముంబై, షిర్డీకి రైళ్లను నడపవచ్చని సమాచారం. నగరంలో రద్దీ పెరగడం.. రైల్వే స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కొత్త రైళ్ల పయనం విజయవంతంగా సాగితే హైదరాబాద్ నగరవాసులేకాకుండా, ఇతర ప్రధాన ప్రాంతాలకు చెందిన వారు గజ్వేల్కు వచ్చి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ లెక్కన సహజంగానే గజ్వేల్ ప్రాంత ప్రాధాన్యం ఒక్కసారిగా పెరగనుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి, ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ పనులు మొదలైతే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది. అంతేకాకుడా ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి బాటలు పడే అవకాశముంది. భారీ, చిన్న తరహ పరిశ్రమలకు సంబంధించిన వస్తు ఎగుమతులు, దిగుమతులకు అవకాశం కలిగిన వ్యాపార రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. వీటన్నంటితోపాటు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి పర్యాటకం రంగం కూడా అభివృద్ధి చెందనుంది. గజ్వేల్ స్టేషన్ అభివృద్ధి అంశాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి ధ్రువీకరించారు.

గజ్వేల్.. మరో టెర్మినల్!

గజ్వేల్.. మరో టెర్మినల్!