ఉమ్మడి మెదక్ జిల్లాలో కరువుతీరా వాన కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన నాలుగు జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఉన్నాయి. సాధారణం కంటే సగటున సుమారు 75 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వానాకాలం సీజన్ ప్రారంభమైన నెల రోజులు అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. వారం రోజులుగా దంచికొడుతున్నాయి. దీంతో పంటలకు ఉపశమనం కలగడమే కాకుండా.. జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి.
– సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సాధారణం నుంచి అత్యధికానికి..
నైరుతి రుతుపవానాల ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. అయితే జూలై మొదటి వారం వరకు ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ రికార్డు అయింది. సంగారెడ్డి జిల్లాను తీసుకుంటే జూన్ నెలాఖరు వరకు 120.1 మి.మీల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 104 మి.మీలు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువ వర్షపాతం రికార్డు అయింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణం నుంచి అత్యధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. సాధారణంగా కురవాల్సిన వర్షం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే లోటు వర్షపాతంగా వాతావరణ శాఖ భావిస్తుంది. అలాగే కురవాల్సిన వర్షం కంటే 19 శాతం తక్కువ కురిసిన, 19 శాతం ఎక్కువ కురిసినప్పటికీ సాధారణ వర్షపాతంగానే లెక్కిస్తారు. 20 నుంచి 59 శాతం వరకు ఎక్కువ వర్షపాతం నమోదైతే అధిక వర్షపాతంగా లెక్కిస్తారు. 60 శాతానికి మించి ఉంటే అత్యధిక వర్షపాతంగా పరిగణిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాతో పాటు, వికారాబాద్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు నిండుకుండలా జలాశ యాలు


