● సందడిగా నవరాత్రి ఉత్సవాలు
● భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం సమీపంలో ఉన్న ప్రసిద్ధ గణేశ్ గడ్డ ఆలయం ఆధ్యాత్మిక శోభతో వికసించింది. సోమవారం ప్రారంభమైన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణలు, గణపతి బప్పా మోరియా జయజయధ్వనులతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, పల్లకీ సేవ, పవిత్ర హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు సంతోష్ జోషి, జగదీశ్వర స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్లు మాట్లాడుతూ... తొమ్మిది రోజుల పాటు స్వామివారు రోజుకో ప్రత్యేక విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్లు తెలిపారు. అదే విధంగా భక్తులందరికీ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నెలవారీ సమీక్షను నిర్వహించారు. వివిధ కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజాభద్రత, సైబర్ నేరాల నివారణ కమ్యూనిటీ పోలీసింగ్, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో దర్యాప్తు చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్లకు కేటాయించిన పోలీసు వాహనాలను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు అభినందించి నగదు రివా ర్డులు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, వెంకట్రెడ్డి, సైదానాయక్, ఏఆర్డీ ఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్
ఎస్పీ ఆఫీస్లో విఘ్నేశ్వరుడికి పూజలు
సంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఆధ్యాత్మిక నిలయాన్ని తలపించింది. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.


