టీబీ జిల్లా కో ఆర్డినేటర్ అరుణ
పటాన్చెరు టౌన్: క్షయవ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తొలిదశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని టీబీ జిల్లా కో ఆర్డినేటర్ అరుణ సూచించారు. పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, చికిత్స అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు టీబీపై అవగాహన పెంచుకుని, చుట్టుపక్కల ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రవీణ, భాగ్య క్లబ్ కన్వీనర్ డాక్టర్ శివదీప్తి, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రొఫెసర్ వెంకటేశం, కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆరోపణలు
సిగ్గుచేటు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నీటి సరఫరా, కాలువల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి మండిపడ్డారు. మండలంలోని మార్డిలో మంగళవారం లబ్ధిదారులకు స్మార్టురేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నల్లవాగు ప్రాజెక్టు కాల్వల్లో పూడిక తీయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పనులు చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివశ్రీనివాస్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పోచయ్య, రవీందర్రెడ్డి, దేవదాస్, జితేందర్రెడ్డి, సంగారెడ్డి పాల్గొన్నారు.
సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
సదాశివపేట(సంగారెడ్డి): సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం పాలనలో జమిందారులు, భూస్వాములు చేసిన దోపిడీ, పీడన, హత్యలు మహిళలపై జరిగిన లైంగిక దాడులకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం సాయుధపోరాటం సాగిందన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నాయకులు రమేశ్గౌడ్,భూషణం, ఖయ్యుం, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా రీ సర్వే
హవేళిఘణాపూర్(మెదక్): భూ భారతి రీ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూ రికార్డులను పరిశీలిచాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మెదక్ మండలం పాశాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీసర్వేను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ల్యాండ్ సర్వే కిషన్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు పాల్గొన్నారు.


