● మున్సిపల్ కార్యాలయం ఎదుట భార్యతో కలిసి నిరసన
● పనులు చేయడం లేదంటూ ఎంఐఎం నేత ఆవేదన
జహీరాబాద్: అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినా.. పీఠం ఎక్కాక తమ వార్డు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్ భర్త మున్సిపల్ కార్యాలయం ఎదుట చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ మున్సిపాలిటీలోని రామ్నగర్ కాలనీలోని 8వ వార్డుకు చెందిన ఎంఐఎం కౌన్సిలర్ సోని భర్త యిర్మియా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్దకు భార్యతో కలిసి వచ్చాడు. కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతున్న సమయంలో కార్యాలయం వద్ద విలేకరులతో వార్డు సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో మనస్తాపంతో చెప్పు తీసుకుని ముఖంపై కొట్టుకున్నాడు. వార్డు సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని విమర్శించారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ప్రాయశ్చిత్తంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరు నెలలుగా తమ వార్డులో కనీస అభివృద్ధి జరగడం లేదని, ఎన్నిసార్లు చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా వారిలో చలనం లేదని మండిపడ్డారు. తమ వార్డు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.


