ఆరుగురికి స్వల్ప గాయాలు
వట్పల్లి (అందోల్): జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జోగిపేట పరిధిలోని సంగుపేట హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో అందోల్లో వర్షం కురుస్తుండగా కారు అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఆరుగురికి కేవలం స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే హైవే అంబులెన్స్లో క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


