పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. రెండు రోజులుగా డ్యాంలోకి ఇన్ఫ్లో చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం 637 క్యూసెక్కులు, బుధవారం 592 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. ప్రస్తుతం డ్యాంలో 4.215 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి పథకాలైన మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి రెండు ఫేజ్ల ద్వారా 1877 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
సంగారెడ్డి క్రైమ్: డీఆర్డీఓ ఆధ్వర్యంలో పట్టణంలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికిరణ్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఫార్మసీ, డీ ఫార్మసీని కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్ ధ్రువపత్రాలతో పట్టణ బైపాస్లోని డీఆర్డీఓ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08455–271010 నంబర్లో సంప్రదించాలని కోరారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వెంకట్ స్వామి బుధవారం ఒక ప్రకటనల్లో పేర్కొన్నారు. పదో తరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీలకు రూ.1400, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1000, ఓపెన్ ఇంటర్ అభ్యర్థులు ఓసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఫీజు రూ.1200గా నిర్ధారించినట్లు తెలిపారు. ఆన్లైన్, మీసేవ ద్వారా అడ్మిషన్ నమోదు చేసుకొని సంబంధిత కేంద్రాల్లో పత్రాలు అందజేయాలని సూచించారు.
కల్హేర్(నారాయణఖేడ్): ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగులో వరద చేరుతుంది. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. వరద ప్రవహం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1483 ఫీట్ల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. అనంతరం కల్హేర్లో ఎస్సీ బాలుర హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన వసతి, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, హాస్టల్లో స్లాబ్ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం భవనం కొత్తగా నిర్మించేందుకు చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రావు, గంగారం, నాయకులు పోచయ్య, ఎండీ. సర్దార్, మోహన్రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు.
జోగిపేట(అందోల్): సింగూరు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ బీబీ పాటిల్ బుధవారం కలెక్టర్కు ఫోన్ చేశారు. సింగూరు ప్రాంత రైతులు 23 ఏళ్లుగా ప్రాజెక్టు నీటి ద్వారానే పంటలు పండించుకుంటున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. వరి పండించుకునేందుకు నీళ్లు ఇస్తే 2027లో తాగడానికి నీరు ఉండదని కలెక్టర్ ఆయనకు తెలిపారు. 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాజెక్టులోకి నీరు వస్తుందని రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలని బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
జిన్నారం(పటాన్చెరు): గడ్డపోతారం పారిశ్రామికవాడలో మంగళవారం రాత్రి పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పారిశ్రామిక వాడలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థ జలాల నమూనాలను సేకరించారు. ఈసందర్భంగా పరిశ్రమల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థ జలాలను వర్షపు నీటిలో విడుదల చేస్తున్నారని స్థానిక నాయకులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్ ఇంద్రసేన, నాయకులు బాలుగారి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


