సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శత్రువు అయినా సరే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు గల్లంతు కాకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు తన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు. ఓటు హక్కును కోల్పోతే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. బుధవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న కుట్రలు ఎటు నుంచి ఎటు పోతాయే తెలియని అయోమయం ఉందన్నారు. ఎన్నికల సంఘం మోదీ సర్కారు నేతృత్వంలో పనిచేస్తోందని ఆరోపించారు. బోనాల పండగ ఉందని ఎస్ఐఆర్ను నిర్లక్ష్యం చేయొద్దని, ఓటు హక్కు పోతే మళ్లీ రాదన్నారు. ఓట్ల కోసమో.. రాజకీయం కోసమో కాకుండా ప్రజలను కాపాడేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ తోడ్పడాలని రాహుల్గాంధీ ఇచ్చిన పిలుపును ఆయన గుర్తుచేశారు. ఆగస్టు 2న మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోశ్, కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు, తోపాజి అనంత్ కిషన్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశంలో జగ్గారెడ్డి


