జహీరాబాద్ టౌన్: పట్టణంలోని అల్లీపూర్లో బాలిక అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. అల్లీపూర్కు చెందిన వడ్డెర తమ్మిశెట్టి రామకృష్ణ కూతురు అక్షయ(12) నీళ్ల కోసం బిందె తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆమె జాడ తెలియలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56763 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.
మతిస్థిమితం లేని యువకుడు..
చేగుంట(తూప్రాన్): మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యమైన సంఘటన మాసాయిపేట మండలం వెనకతండాలో చోటు చేసుకుంది. ఎస్ఐ బిక్యానాయక్ వివరాలు.. తండాకు చెందిన మలోత్ చింటూ(19) పుట్టుకతో చెవిటి, మూగతో పాటు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో అతడు సోమవారం సాయంత్రం తండాకు వచ్చిన ఓ స్కూల్ బస్సులో ఎక్కి పెద్దశివునూర్ రోడ్డు వద్ద దిగిపోయాడు. అప్పటి నుంచి చింటూ ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం తండ్రి కిమ్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
తల్లి మందలించడంతో..
సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. పట్టణంలోని జలాల్బాగ్ కాలనీకి చెందిన కవేలి శంకరయ్య (32), అమ్మానాన్నలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. పని విషయంలో అమ్మన్నాలతో పలుమార్లు గొడవపడితే పెద్దల సమక్షంలో నచ్చజెప్పారు. కాగా తల్లి పని చేయడం లేదని కోపంలో మందలించింది. దీంతో ఆవేశంలో శంకరయ్య ఈ నెల 23న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.


