సంగారెడ్డి టౌన్: దేశవ్యాప్తంగా వివిధ పీఠాల స్వామీజీల ఆదేశాల మేరకు గోరక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు గోసంతతి సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే సండే మార్కెట్ హనుమాన్ మందిరం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో గోమాతను ప్రత్యేకంగా వెంట తీసుకెళ్లారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సేకరించిన రెండు లక్షల సంతకాల ప్రతులను కలెక్టర్ ప్రతీక్ జైన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరక్షా అభియాన్ నాయకులు సుభాష్ చందర్, షెరీన్ సింగ్, సోహన్, కౌన్సిలర్ జగన్, దామోదర్ రెడ్డి, ద్వారకా రవి పాల్గొన్నారు.


