నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది వినతులు వచ్చాయి. అయితే 40 ఏళ్ల కిందట ప్రభుత్వం తనకు 4.18 ఎకరాల భూమిని పంపిణీ చేయగా.. సర్వే నిర్వహించి తనకు భూమి చూపాలని కోరుతూ కరస్గుత్తికి చెందిన ఇస్మాయిల్ వినతిపత్రం అందజేశారు. అలాగే తనభూమి 161బీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తన భూమి కోల్పోతున్నా.. తనకు పరిహారానికి సంబంధించిన నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని డీఎన్టీ తండాకు చెందిన మారుతి కోరారు. అంబోజీ కాలనీలో రహదారి వెంట కంచెలు వేసి మొక్కలు నాటిన వారిపై చర్యలు తీసుకొని రహదారి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.


