జిన్నారం (పటాన్చెరు): టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుమ్మడిదల పట్టణ కేంద్రంలోని అన్నారం జాతీయ రహదారిపై అశోక్ లీలాండ్ (ఆటో) వాహనాన్ని వెనకాల వచ్చిన టిప్పర్ లారీ ఢీ కొట్టింది. బాలానగర్ వైపు నుంచి వస్తున్న రెండు వాహనాల్లో అశోక్ లీలాండ్ వాహనం అన్నారం ప్రకృతి నివాస్ ఎదుట ఉన్న డివైడర్ను దాటే క్రమంలో వెనకాల ఉన్న టిప్పర్ లారీ అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో అశోక్ లీలాండ్ వాహనం బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటు చేస్తుంది. అశోక్ లీలాండ్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగరాజు (40)పై వాహనం పడడంతో మృతి చెందాడు. డ్రైవర్ రిజ్వాన్, తోటి ప్రయాణికుడు చిన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


