ప్రభుత్వం సర్కారీ స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు అనుభవమున్న ఉపాధ్యాయులతో బోధన చేస్తున్నప్పటికీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తరగతులు ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది. అందులోభాగంగానే ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీలు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది మరిన్ని ప్రీప్రైమరీల ఏర్పాటుకురంగం సిద్ధమైంది.
న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో 860 ప్రాథమిక, 197 ప్రాథమికోన్నత, 205 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నప్పటికీ ప్రీ ప్రైమరీలు లేకపోవడంతో అధికశాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గతేడాది జిల్లాలో 59 ప్రీ ప్రైమరీలను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలలో ఇన్స్ట్రక్టర్తోపాటు ఆయాను నియమించింది. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు వేతనంగా ఇస్తోంది. ఆట పాటల ద్వారా సుమారు 38 రకాలుగా వివిధ రూపాల్లో చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. దీంతో గతేడాది 750 మంది చిన్నారులు ప్రీ ప్రైమరీల్లో చేరారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రీప్రైమరీలు మంచి ఫలితాలనివ్వడంతో ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాకు మరో 132 ప్రీ ప్రైమరీలను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో 22 ప్రీ ప్రైమరీలు, నాన్ కోర్ పరిధిలో 110 ప్రీ ప్రైమరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్స్ట్రక్టర్లతోపాటు ఆయాలను నియమించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. వీటి ఏర్పాటుతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుంది.
గతేడాది 59 మంజూరు
సర్కారీ స్కూళ్లల్లో
విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి


