రామచంద్రాపురం(పటాన్చెరు)/పటాన్చెరు: నిత్యం కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన క్రీడాకారులను మహిపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 23,24తేదీల్లో శ్రీలంకలో జరిగిన క్రీడాపోటీల్లో రామచంద్రాపురానికి చెందిన క్రీడాకారులు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. పెద్దకంజర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జునస్వామి దేవాలయం, బీరప్పస్వామి దేవాలయాల నిర్మాణాలను సొంత నిధులతో త్వరలోనే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐనోలు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో తనకు అందించాలని..త్వరలో గ్రామంలో పర్యటించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్రీడాకారులు మల్లారెడ్డి, గంగాధర్రెడ్డి, అనుశ్రీ, యోగిత, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి


