తప్పిన ప్రమాదం
నారాయణఖేడ్: బొలెరో వాహనానికి విద్యుత్తు తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఖేడ్ మండలం పీర్లతండాకు చెందిన రైతు రాజు పశువుల మేత కోసం శుక్రవారం తుర్కాపల్లికి చెందిన రైతు భూపాల్ రెడ్డి నుంచి గడ్డిమోపులను కొనుగోలు చేసి బొలెరో వాహనంలో తరలిస్తున్నాడు. అక్కడ డ్రైవర్ పైనున్న హైటెన్షన్ విద్యుత్తు తీగలను గమనించకుండా వాహనాన్ని తీశాడు. దీంతో గడ్డిమోపులు తీగలకు తగిలి షార్ట్సర్క్యూట్ అయి మంటలంటుకున్నాయి. సమీపంలో ఉన్న రైతులు ఖేడ్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కాగా సమీపంలోని బోరుమోటారుతో గడ్డిమోపులపై బిందెలతో నీళ్లు చల్లారు. మరోవైపు వాహనంలో ఉన్న గడ్డిని కిందకు తీశారు. అంతలోనే అగ్నిమాపక శకటంతో వచ్చిన సిబ్బంది మంటలార్పారు. వాహనానికి ఎలాంటి నష్టం జరగకపోగా రూ.10 వేల విలువచేసే గడ్డిమోపులు దగ్ధమయ్యాయి.


