సిద్దిపేటజోన్: మానసిక వికాసానికి యోగా ఒక్కటే అద్భుత ఔషధమని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సిద్ధిపేట కోమటి చెరువు రుబి నెక్లెస్పై యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా న్యాయనిర్ణేతల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి విధ్వంసంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కాలుష్యాలు, చెడు ఆహార అలవాట్లు, అవాంఛనీయ జీవనశైలి మనుషులను రోగాలకు దగ్గర చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా సాధన తప్పనిసరి చేశారన్నారు. మనిషి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. బాల్యం నుంచే యోగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన యోగా సాధకులతో సామూహిక సూర్య నమస్కారాలు చేయించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, యోగా గురువు సతీశ్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామ్రెడ్డి, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్, అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి


