ఒకప్పుడు పచ్చనిపొలాలు..నిండుకుండలా బావులు, చెరువులు..కొద్ది అడుగుల్లోనే ఉప్పొంగే బోర్లతో తెల్లాపూర్ కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోతోంది. అభివృద్ధి పేరిట వేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలు భూమి అడుగున ఉన్న భూగర్భజల సంపదను మింగేస్తున్నాయి. రామచంద్రాపురం(పటాన్చెరు):
ఔటర్ రింగ్ రోడ్డు పుణ్యమంటూ తెల్లాపూర్ ప్రాంత రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆకాశానికి అంటుకునేలా టవర్ల నిర్మాణం, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద ఎత్తున విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు తెల్లాపూర్ అంటే రియల్ ఎస్టేట్కు హబ్గా మారిపోయంది. మహానగరంగా విస్తరించడంతో జీవనోపాధికే ఇతర రాష్ట్రాల నుంచి వలసపెరగడంతో జనాభా రోజురోజుకు పెరుగుతుంది. దాని కారణంగా నీటి వినియోగం ఒక్కసారిగా పెరిపోయింది. ఒకప్పుడు 150 నుంచి 200 అడుగుల్లో నీరు పడేది. ప్రస్తుతం కొన్ని చోట్ల 1,200 అడుగులలోతులో కూడా నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది.
చెరువులే ముఖ్యమైన వనరులు..
తెల్లాపూర్ పరిధిలో మేళ్ల, వనం చెరువు, చెలికుంటలున్నాయి. చెరువులే ఒకప్పుడు ప్రధాన జలవనరులుగా ఉండేవి. వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భజలాలను అభివృద్ధి చేసేవి. దీంతో బావులు, బోర్లు నీటితో నిండుగా ఎండేవి. కానీ ప్రస్తుతం చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరగడం, భారీ నిర్మాణాలు, మురుగునీటి కారణంగా చెరువుల విస్తీర్ణం తగ్గిపోయాయి. ఈ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలు మూసుకుపోయాయి.
ట్యాంకర్ల రాజ్యం..?
తెల్లాపూర్ పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా నడుస్తోంది. నిత్యం వందలాది ట్యాంకర్లతో లక్షలాది లీటర్ల నీరు తరలిపోతున్నా దీనిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
తెల్లాపూర్ భవిష్యత్ ఏంటి..?
నీటి సంరక్షణపై ఇప్పటికై నా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తెల్లాపూర్ ప్రాంతంలో తీవ్ర త్రాగునీటి సంక్షోభం ఎదురయ్యే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువులను పరిరక్షించుకోక, వర్షపు నీటిని సంరక్షించక, అక్రమ బోర్లను నియత్రించకపోతే బెంగళూరులో నీటి ఎద్దడి పరిస్థితులే భవిష్యత్లో ఎదురయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
పాలకులు ఇప్పటికై నా స్పందించి చెరువుల ఆక్రమణలను పూర్తిస్థాయిలో నియంత్రిడంతోపాటు ఎఫ్టీఎల్ పరిధి హద్దులను ఏర్పాటు చేయాలి. ప్రతీ అపార్ట్మెంట్లో, ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలి. అక్రమ నీటి వ్యాపారం అరికట్టాలి. ప్రధానం వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి.
భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదా?
ఒకప్పుడు 150 అడుగుల్లోనే నీళ్లు
ఇప్పుడు 1500 అడుగులకు వెళ్లినాలభించని వైనం
ఆకాశహార్మ్యాలతో కాంక్రీట్జంగిల్గా మారుతున్న ప్రాంతం
నీటి సంరక్షణపై అవగాహనపెంచాలంటున్న నిపుణులు


