చెట్టు కొమ్మలు కోస్తుండగా..
కొండపాక(గజ్వేల్): మేకల మేత కోసం చెట్టు ఎక్కి కొమ్ములు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మి(40) దినచర్యలో భాగంగా ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లింది. పని ముగిశాక తోటి కూలీలతో ఇంటికి వస్తుండగా ఇంటి వద్దనున్న మేక పిల్లల మేత కోసం రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఎక్కింది. అయితే పక్కనే విద్యుత్ వైర్లు చెట్టుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. తోటి కూలీలు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. విద్యుత్ అధికారులు ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఆరేళ్ల క్రితమే భర్త మృతి
భర్త శివులు మొదటి భార్య చనిపోవడంతో ముగ్గురు పిల్లలను చూసేందుకు లక్ష్మిని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల అనంతరం శివులు చనిపోయాడు. దీంతో కుటుంబ పోషణ భారమంతా లక్ష్మి పైనే పడింది. ఇప్పుడు లక్ష్మి కూడా మృతి చెందడంతో ముగ్గురు పిల్లల్ని పోషించేదెవరని బంధువులు, గ్రామస్తులు విలపిస్తున్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ వెంకట్గౌడ్ కోరారు.


