చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో జంతు వధశాల ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అరుణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పాలకవర్గ సభ్యులు పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా పట్టణంలో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, జేసీబీ రిపేర్ చేయడంతో పాటు బకెట్ పెట్టించడం, వర్షాకాలం సీజన్ కావడంతో అవసరమైన బ్లీచింగ్ పౌడర్, సున్నం, దోమల నివారణ మందుల కొనుగోలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నూతన జంతు వధశాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


