ప్రయాణికురాలి బ్యాగులోనుంచి అపహరణ
రామాయంపేట(మెదక్): ప్రయాణికురాలి వద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం స్థానిక బస్టాండులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన దేవలక్ష్మి తన తల్లితో కలిసి అక్కన్నపేటలో ఉంటున్న కూతురు వద్దకు వచ్చింది. తిరిగి స్వగ్రామం వెళ్లడానికి స్థానిక బస్టాండులో బస్సు ఎక్కుతుండగా, ఆమె బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బ్యాగును చూసుకున్న ఆమె ఆభరణాలు కనిపించకపోవడంతో బస్సు డ్రైవర్, కండక్టర్కు చెప్పింది. దీంతో వారు బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు బస్సులో ఉన్న ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు బస్టాండులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి పక్కనే ఉన్న గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు.


