నర్సాపూర్: ఓ కాంట్రాక్టరు నుంచి విద్యుత్ శాఖ ఏడీఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం నర్సాపూర్లో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు చెందిన ఓ కాంట్రాక్టరు 2023 నుంచి 2025 మధ్య కాలంలో నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలో 11 పనులు చేయగా అతనికి రూ.3లక్షల 13,882 బిల్లు ఆ శాఖ నుంచి రావాల్సి ఉంది. కాగా సదరు బిల్లును ఉన్నతాధికారులకు పంపడానికి స్థానిక ఏడీఈ రమణారెడ్డి రూ.30వేలు ఇవ్వాలని కాంట్రాక్టరును డిమాండు చేశాడు. అతను బతిమిలాడటంతో రూ.25వేలకు అంగీకరించాడు. కాగా శుక్రవారం ఏడీఈకి అతని కార్యాలయంలో కాంట్రాక్టరు లంచం ఇవ్వగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. పట్టుబడిన ఏడీఈని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. రమణారెడ్డి నివాసాల్లో సైతం తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. స్థానిక దాడుల్లో తనతో పాటు ఇన్స్పెక్టర్లు వెంకటేశం, రమేశ్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


